పెరుగుతున్న గోదావరి
లోతట్టు గ్రామాలకు రాకపోకలు బంద్
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఉమ్మడి మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి నది పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర లోని ప్రాణహిత నది నుండి వరద ప్రవాహం రావడం తో కాళేశ్వరం వద్ద గోదావరి నదిక్రమేపి పెరుగుతుంది. బుధవారం సాయంత్రం వరకు మహదేవపూర్ మండలంలో172.4, పలిమెల మండలంలో అత్యధికంగా 264.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
భారీ వర్షాలకుఉమ్మడి మండలంలో చెరువులు కుంటల లలో జలసిరి సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహాదేవపూర్ మండలంలోని చంద్రుపల్లి పల్లి వద్ద ఉన్న కలవర్ట్ పై నీరు ప్రవహిస్తునడం వల్ల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి, మండలం కేంద్రంలో చెట్టు పడి రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ కు 74వేల 390 క్యూసెక్కుల వరద నీరు రాగా బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి ఆదే స్థాయిలో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.






