26-06-2025 12:00:00 AM
-అక్రమంగా రూ.వెయ్యి కోట్లు సేకరణ
-ఖరీదైన కార్లలో జల్సా
-విందు వినోదాల్లో నిర్వాహకులు
నల్లగొండ టౌన్, జూన్ 25 : ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా లక్షాధికారులు కావాలనే అత్యాశ కొంతమందిని కోటీశ్వరులను చేస్తుంటే.. మరికొంతమందిని రోడ్డున పడేలా చేస్తోంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్లో కొన్నేళ్లుగా ఓ నయాదందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీ పేరుతో పేదల నుంచి రూ.లక్షలు వసూలు చేసి కొత్తతరం మోసానికి వడ్డీ వ్యాపారి తెర లేపినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే వ్యాపారులు పేదల నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా ఎక్కడా ఆధారాలు ఉండవు.
అప్పు ఇచ్చిన వారికి ఎటువంటి హామీ పత్రాలు కానీ, ప్రామిసరీ నోట్లు కానీ ఇవ్వడం లేదని సమాచారం. కానీ వ్యాపారులు మాత్రం పేదలకు చెల్లించే వడ్డీ సొమ్ము వివరాలను పటిష్టంగా ఆధారాలతో చెల్లింపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు మొదలుకుని రూ.10 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. కాగా ఈ దందా గత నాలుగేళ్లుగా కొనసాగుతున్నట్లు వినికిడి. అయితే అప్పుగా తీసుకున్న వ్యాపారి ఆ డబ్బును రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.
కాగా, అందులో వచ్చిన డబ్బుతో అప్పులు ఇచ్చిన వారికి వడ్డీలు చెల్లిస్తుండగా అసలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే వ్యాపారి మాత్రం తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేకుండా జాగ్రత్త పడుతూ అన్ని తన బంధువుల పేరు మీద చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వడ్డీ వ్యాపారి పక్కాగా నమ్మిన వాళ్ల గొంతు కోసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు ఈ వడ్డీ వ్యాపారి పై దృష్టి సారించి పేదలకు న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది
అధిక వడ్డీ పేరుతో..
పీఏపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ, రవి నాయక్ అనే వ్యక్తులు కలిసి వద్దిపట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్, కాంట్రాక్టర్ కే పెద్ద శ్రీను, సట్టు నరేష్ లను అనే ఇద్దరు వ్యక్తులను కలిసి ఏజెంట్లుగా నియమించుకొని వారిద్వారా 20 రూపాయలు వడ్డీ నీ ఆశ చూపి అక్రమంగా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సమాచారం . ఇందులో పోలీసులకు కూడా నెల నెల ముడుపులు ముడుతున్నట్లు వినికిడి.
పేద గిరిజనులు అధిక వడ్డీకి ఆశపడి తమ ఇండ్లను భూములను, బంగారాన్ని బ్యాంకుల్లో, ప్రైవేట్ ఫైనాన్స్ లు తాకట్టుపెట్టి, మూడు రూపాయల వడ్డీకి తెచ్చి మరి సదరు నలుగురు వ్యక్తులకు డబ్బులు ఇస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ, పీఏపల్లి చందంపేట, సాగర్ నియోజకవర్గం లోని పెద్దవూర మండలాలలోని అమాయక గిరిజనులతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో పేద కులాలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులు బంగారు ఆభరణాలు, ఉంగరాలు ధరించి, ల్యాండ్ క్రూజర్ వాహనాల్లో తిరుగుతూ హైదరాబాదులో విల్లాలను కొనుగోలు చేసి విలాసమైన జీవితాలను గడుపుతున్నారు. వీరి వల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అమాయక గిరిజనులు కోట్లాది రూపాయలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..
పీఏపల్లి మండలంలోని వద్దిపట్ల పలుగు తండాల్లో అమాయకుల నుంచి అధిక వడ్డీ నీ ఆశ చూపి ఆర్బిఐ రూల్స్ వ్యతిరేకంగా సుమారు 1000 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని ఈ నెల 16న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గిరిజన వ్యక్తి అధికంగా వడ్డీ ఇస్తానని చెప్పి పేద వర్గాల నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంటున్నారని సమాచారం. రూ.లక్ష అప్పుగా తీసుకుని ప్రతి నెలా రూ.16 వేలు వడ్డీ చెల్లిస్తానని చెబుతూ వందలాది మంది సామాన్యుల వద్ద అప్పుగా తీసుకుంటున్నారని తెలుస్తుంది.
అయితే వడ్డీ వ్యాపారి సామాన్యుల దగ్గర డబ్బులు తీసుకునే ముందు ఒక మధ్యవర్తి ద్వారా తీసుకుంటారని, అది కూడా ఎలాంటి లిఖిత పూర్వకంగా పత్రాలు లేకుండా తీసుకుంటారని వినికిడి. కానీ వడ్డీ వ్యాపారి తీసుకున్న అప్పుదారులకు ప్రతినెలా కచ్చితంగా వడ్డీ చెల్లిస్తారని, అవి కూడా పూర్తిగా బ్యాంకు ఖాతా నుంచి చేస్తూ ఉంటారని సమాచారం. ఈ రకమైన దందా దాదాపు నాలుగైదు ఏళ్లుగా జరుగుతుందని గ్రామాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు సుమారుగా 1000 మందికి పైగా సామాన్యుల నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే గ్రామాల్లో సామాన్యుల నుంచి తీసుకున్న అప్పుసొమ్ముతో సదరు వడ్డీ వ్యాపారి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. ఇక్కడ వచ్చే లాభాలను అప్పుదారులకు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లిస్తారని సామాన్యులతో పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా నిఘా వర్గాలు ఈ వడ్డీ వ్యాపారిపై దృష్టి సారించి అమాయక గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే వడ్డీ వ్యాపారి బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.