17-06-2025 12:00:00 AM
కన్నాయిగూడెం, జూన్ 16 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం నార్త్ రేంజ్ అటవీ శాఖ అధికారులపై ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్టులో గుడిసెలు వేసిన గిరిజనులు సోమవారం దాడులకు దిగారు. గత సంవత్సర కాలంగా ఏటూరునాగారం మండలం నార్త్ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని రొయ్యూర్ బీట్, రొయ్యూర్ సెక్షన్లోని రిజర్వ్ ఫారెస్ట్లోని అటవీ ప్రాంతంలో కొంత మంది గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.
పలుమార్లు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేసి, గుడిసెలను తొలగించినా తిరిగి గుడిసెలు నిర్మిస్తూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి గుడిసెలను తొలగించేందుకు సోమవారం ఉదయం అటవీ శాఖ అధికారులు వెళ్లారు. దీంతో గిరిజనులు తిరగబడగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
గిరిజనులు అటవీ శాఖ అదికారులపై కారంపొడి చల్లుతూ కర్రలతో దాడులకు దిగారు. జేసీబీపై అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్పై కత్తితో దాడి చేయగా గాయం అయినట్లు సమాచారం. ప్రాణ భయంతో అటవీ శాఖ అధికారులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అటవీ శాఖ పరిధిలో అక్రమంగా గుడిసెలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
పోలీసుల సాయంతో బయటపడ్డాం
అక్రమంగా అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశామని నార్త్ రేంజ్ డిప్యూటీ రేంజ్ అధికారి ఏండీ అప్సర్ ఉన్నిసా తెలిపారు. ఈ క్రమంలోనే గుడిసెలు వేసిన గిరిజనులు తమపై కర్రలు, కారంపొడితో దాడికి దిగారని చెప్పారు. జేసీబీ డ్రైవర్ అల్లం రమేశ్కు గాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డామన్నారు.