25-05-2025 12:30:18 AM
వాషింగ్టన్, మే 24: ఐఫోన్ల ఉత్పత్తికి సంబంధించి టెక్ పరికరాల అగ్రగామి సంస్థ యాపిల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో 25 శాతం సుంకాన్ని విధిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టారిఫ్ బాం బ్ను మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్పైనా విసిరారు. శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్ఫోన్లకు టారిఫ్ల నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు.
శనివారం వైట్హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడారు. యాపిల్ ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయన్నారు. శాం సంగ్ అయినా మరే సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని హెచ్చరించారు.
ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే వారికి ఎలాంటి టారిఫ్లు ఉండవన్నారు. అలా కాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే మాత్రం అది న్యాయమైన ప్రక్రియ కాదు అని ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్.. అమెరికా మార్కెట్లో విక్రేతలో రెండో స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా.. ఇందులో 60శాతం మొబైల్స్ను వియత్నాలంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు తాజా పరిణామాలతో అమెరికా మార్కెట్లలో యాపిల్ షేర్లు 2.6 శాతం వరకు కుంగిపోగా.. కంపెనీ సంపద 70 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.