29 March, 2026 | 4:03 AM

భారత్‌కు రెండు ఎల్పీజీ నౌకలు

29-03-2026 01:50 AM
  1. హోర్ముజ్ దాటిన ఒకటి బీడబ్ల్యూ ఈఎల్‌ఎం, మరోటి బీడబ్ల్యూ టీవైఆర్
  2. ఈ నౌకల్లో 90,000 మెట్రిక్ టన్నులకుపైగా ఎల్పీజీ గ్యాస్
  3. గుజరాత్ట్‌కు చేరిన జగ్ వసంత్ 

టెహ్రాన్/న్యూఢిల్లీ, మార్చి28: భారత్ జెండాలు కలిగిన రెండు ఎల్పీజీ కంటైనర్లు బీడబ్ల్యూ ఈఎల్‌ఎం, బీడబ్ల్యూ టీవైఆర్‌లు హోర్ముజ్ జలసంధిని దాటాయి. శక్రవారం దుబాయ్ రస్‌ఆల్‌ఖైమాకు ఉత్తరాన లంగర్ వేసిన ఐదు నౌకలలో ఇవి కూడా ఉన్నాయి. ఈఎల్‌ఎం నౌక హెచ్‌పీసీఎల్‌ది కాగా, టీవైఆర్ నౌక బీపీసీఎల్‌కు చెందినది. భారత్ సహా మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హోర్ము జ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు నౌకలు సురక్షితంగా హోర్ముజ్‌ను దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి.

ఈ నౌకల్లో 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ గ్యాస్‌వస్తోంది. మరికొన్ని భారతీయ ట్యాంకర్లు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ సమీపంలోని జలాల్లో ఇరాన్ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. కాగా, 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన జగ్ వసంత్ ట్యాంకర్ నౌకగుజరాత్‌లోని వదినార్ పోర్టుకు శనివారం చేరుకుంది.