27-10-2025 10:36:23 AM
ఘట్ కేసర్: నీటి గుంతలో పడి అక్కా, చెల్లెలు మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు అక్కా చెల్లెలు ఆదివారం సెలవు దినం కావటంతో తల్లిదండ్రులు ఊరికి వెళ్లగా పశువులకు నీళ్లు తాపడానికి వెళ్లి ఇద్దరు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఘట్ కేసర్ మున్సిపల్ అంకుషాపూర్ కు చెందిన కొండల మల్లేష్ కుమార్తెలు హరిణి (16), గాయత్రి (13)లు ఎన్ ఎఫ్ సి నగర్ లో నివాసం ఉంటున్నారు.
మధ్యాహ్నం సమయంలో అక్కా చెల్లెళ్లు పశువులకు నీళ్లు తాపడానికి సమీపంలోని ప్రశాంత్ నగర్ గుట్టల మధ్య ఉన్న కుంటలోకి వెళ్లి గల్లంత య్యారు. సాయంత్రం ఇంటి వచ్చిన మల్లేష్ కుమార్తెలు కనిపించకపోవటంతో చుట్టుపక్కల వెతకగా నీటి గుంత వద్ద చెప్పులు, చున్నీలు కనిపించాయి. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇద్దరు బాలికల శవాలు నీటి గుంతలో లభించాయి. మృతి చెందిన కుమార్తెలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. గుంత ఒడ్డున ఇద్దరి చెప్పులు అలాగే పెద్ద అమ్మాయి హరిణి స్వెట్టర్ విడిచి ఉండడం పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.