3 April, 2026 | 3:17 AM

వేధింపులు తాళలేక భర్తను హత్య చేసిన భార్య

29-11-2025 12:17 AM

అడ్డుకోబోయిన కుమార్తెను గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టిన వైనం 

మేడ్చల్, మేడిపల్లి, నవంబర్ 28 (విజయ క్రాంతి): రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్తను కుమారుడు, మరొకరితో కలిసి భార్య హత్య చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్డుకోబోయిన కుమార్తెను గదిలో బంధించి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల కథనం ప్రకారం దేవేందర్ నగర్‌కు చెందిన బండారు అంజయ్య (52) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

నిత్యం మద్యం తాగి వచ్చి భార్యాపిల్లలను వేధింపులకు గురి చేస్తుండడంతో గురువారం రాత్రి భార్య బూగమ్మ, చిన్న కుమారుడు రాజు, మరొక బంధువుతో కలిసి అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను గదిలో బంధించారు.

శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడు బండారి ఉదయ్ కుమార్ తెల్లారి నిద్రలేచేసరికి అనుమానాస్పద స్థితిలో తమ తండ్రి మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని కుమార్తె చెప్పడంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.