19-06-2025 12:41:47 AM
- అధికారుల వసూలుకు కలిసొచ్చిన అవకాశం
-క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పంపకాలు
సిద్దిపేట జూన్ 18(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా విద్యుత్ శాఖలో అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జిల్లాస్థాయి అధికారుల పట్టింపు లేకపోవడంతో విద్యుత్ శాఖలోనీ పలు విభాగాలలో గల అధికారులు ఇష్టరీతిగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకాపోవడం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ శాఖ జిల్లా స్టోర్ లో కీలక బాధ్యత కలిగిన అధికారి బినామీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖలో అటెండర్ నుంచి జిల్లా ఆఫీసర్ వరకు తెలిసిందే. గుట్టుగా సాగుతున్న బినామీ కాంట్రాక్టర్ విషయాన్ని విజయక్రాంతి ఇది వరకే ప్రచురించింది. తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న ఉద్యోగులపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టకపోవడం వెనక భాగస్వామ్యమే కారణం అయ్యుండొచ్చు అని శాఖలో జోరుగా చర్చ సాగుతుంది.
నాకు అన్ని తెలుసు...
విద్యుత్ శాఖ జిల్లా స్టోర్ లో ఒకే కాంట్రాక్టర్ కు కోట్లా రూపాయల పనులు అప్పగించిన కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది. అదే శాఖలోని కొంతమంది అధికారులు ఇదేంటని ప్రశ్నించగా నాకు అంతా తెలుసని, ఎవరు ఏమి మాట్లాడుకున్నా నాకేమీ ఇబ్బంది లేదని, ఎవరి వాటాలు వారికి ఇచ్చానని సదరు అధికారి బదులిచ్చినట్లు తెలిసింది. ఇంత జరిగిన ఆ అధికారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, కనీసం ఆ బాధ్యతల నుంచి తప్పించకపోవడం వెనక మతలాబ్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.
కలిసొచ్చినా అవకాశం...
సిద్దిపేట జిల్లాలో 486 విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్లు మంజూరు ఉండగా ప్రస్తుతం 364 మంది ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట (34), గజ్వేల్(12), హుస్నాబాద్(72) డివిజన్ లో మొత్తం 117 మంది విద్యుత్ శాఖలో పదవి విరమణ పొందిన ఉద్యోగులే ఆపరేటర్లుగా (ఆన్ ఫిట్ ఆపరేటర్లు) పనిచేస్తున్నారు. వీరిలో 60 శాతానికి పైగా బినామీ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఆపరేటర్ కు ప్రతి నెల రూ.22 వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే అందులో రూ.10వేలు ఉద్యోగ విరమణ పొందిన ఆపరేటర్ తీసుకోగా వారు ఏర్పాటు చేసుకున్న బినామీ ఆపరేటర్ కు రూ.7 నుంచి 8 వేలు (ఒక్కొక్క చోట ఒక్కోరకంగా) ఇస్తున్నారు. మిగతా మొత్తాన్ని ప్రతినెల ఆయా పరిధిలో గల అధికారులు వసూలు చేసుకుంటున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. ఆపరేటర్ల పైఅధికారి అడిగినంత ఇవ్వకపోతే తనను ఆ పోస్టు నుంచి తొలగిస్తానంటూ బెదిరింపులకు పాల్పడతారు.
సబ్ స్టేషన్ లో సుమారు ఇద్దరు ఆపరేటర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నవారికి పని భారం కాగా అర్హులైన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అన్ ఫిట్ ఆపరేటర్లు విధులు నిర్వహించకుండానే ప్రతినెల వేతనం పొందుతున్నారు. వీరు విధులు నిర్వహిస్తున్న పలు సబ్ స్టేషన్ లలో అనేకమార్లు సమస్యలు ఉత్పన్నమైన సందర్భాలున్నాయి కానీ అధికారులు వారిని తొలగించకపోవడానికి వారు ప్రతి నెల అం దిస్తున్న మామూళ్లు కారణమని తెలిసింది. వసూలు చేసిన మొత్తాన్ని క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యోగులు వాటాలుగా పంచుకుంటున్నారని శాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.