06-05-2025 03:40:09 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటని, రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే చెప్పడం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని నడపలేమనే స్థితిలో కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం అనాలోచితంగా హామీలిచ్చి, ఇప్పుడు ఆ హామీల అమలు చేతగాక అప్పు పుడ్తలేదని, ఎవరు నమ్ముతలేరు అనే మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి అసమర్థతకు అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు.
అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి యావత్ భారతదేశం ముందు తెలంగాణ పరువు తీసిన తీరు దారుణమని ప్రభుత్వ పెద్దగా ఉంటూ ప్రజల్లో ధైర్యం నింపాల్సిందిపోయి అధైర్యాన్ని నూరిపోస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఆర్ గ్యారంటీల హామీలను అమలు చేయలేక చేతులెత్తేశరని, కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.