వరద సహాయక చర్యలకు డ్రోన్లు వాడండి
- భద్రాద్రి కలెక్టర్ జితేష్ వీ పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో గోదావరి వరద లు సంభవిస్తే, ముంపువాసులకు సాయం చేసేందుకు అవసరమైతే అగ్రికల్చర్ డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఆదేశించారు. కొత్తగూడెం ఐడీవోసీలో మంగళవారం వరద ముంపుపై నిర్వహించి న సమావేశంలో మాట్లాడారు. ముంపు ప్రాంతవాసులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలను కాపాడేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు సిద్ధంగా ఉండాలన్నారు.
వరద ముప్పు నివారణకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ప్రజల కోసం నిత్యావసరాలు నిల్వ చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. వరద ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమిం చాలన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో24 గంటలు పనిచేసే ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. అలసత్వంతో ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి కారణమైనా, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు కలెక్టర్ దివాకర
జయశంకర్ భూపాలపల్లి (ములుగు): వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో పర్యటించారు. వరదల సమయంలో అధికారుల ఆదేశాలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. వరద ఉధృతి ఎక్కువైతే యంత్రాంగం వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ గతతంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన జంపన్న వాగు వంతెన పనులను పరిశీలించారు. వాగుపై తాత్కాలికంగా చేపట్టిన వంతెన పనులపై సూచనలిచ్చారు.






