27-05-2025 04:33:26 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School)లో గతంలో విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న పూర్వ విద్యార్థులకు గురుకుల విద్యా సంస్థ వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించిందని కాసిపేట గురుకుల బాలుర పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉటూరి సంతోష్ కుమార్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గురుకుల పాఠశాలలో 2017 నుంచి ఇప్పటివరకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువు అభ్యసించలేని స్థితిలో ఉండి నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు గురుకుల విద్యాసంస్థ ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ,30 రోజులపాటు ప్రతిరోజు మూడు గంటల శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో ఈనెల 30 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల పనివేళల్లో సంప్రదించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలన్నారు.