08-06-2025 12:00:00 AM
దట్టమైన నల్లమల అడవి.. చుట్టూరా కొండలు.. వాటి మధ్యలో జాలువారే జలపాతం. ఈ దృశ్యం చూడాలంటే నాగర్కర్నూల్ వెళ్లాలి. ఇక్కడికి వెళ్తే చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి పురాతన దేవాలయం కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వీకెండ్ టూర్కి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మధ్యలో.. అటవీ ప్రాంతంలో ఉంది మల్లెలతీర్థం జలపాతం. ఈ జలపాతం పేరు వెనక పురాణ కథ ప్రచారంలో ఉంది. అర్జునుడు మల్లెపూలతో ఇక్కడే శివుడికి పూజలు చేశాడని.. అందుకే ఈ జలపాతానికి ‘మల్లెలతీర్థం’ అని పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు. అంతేకాదు ఈ ప్రాంతంలో రుషులు తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహం పొందారట.
దాదాపు ఐదొందల అడుగుల లోతు లోయ. లోయ గుండా జలపాతం దగ్గరకి వెళ్లడానికి 350 మెట్లు ఉంటాయి. ఇక్కడ నూటయాభై అడుగుల ఎత్తు నుంచి కిందకి దుమికే జలపాతం నీళ్లు వాన చినుకుల్లా శివలింగం ఆకారంలో ఉన్నరాళ్ల మీద పడతాయి.
జలపాతం దగ్గరకు వెళ్లేందుకు 20 రూపాయల టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్ ఉదయం ౮ నుంచి సాయంత్రం ౫ గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ కారు పార్కింగ్తో పాటు కాసేపు రెస్ట్ తీసుకునేందుకు గార్డెన్ కూడా ఉంది. నాగర్ కర్నూల్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది మల్లెల తీర్థం.
పురాతన దేవాలయం
అమ్రాబాద్ మండలం లోని మన్నూర్ గ్రామంలో ఉంది ఈ దేవాలయం. రెండో శతాబ్దం నాటి గుడి ఇది. చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి ఆలయంగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ శివుడు ‘ఉమామహేశ్వరుడి’ గా పూజలందుకుంటాడు. ఇక్కడ కనిపించే శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఒకవైపు తెలుపు రంగులో, మరోవైపు ఎరుపు రంగులో ఉంటుంది.
శిశుడు ఇక్కడ సహజంగా ఏర్పడిన గుహలో కనిపించాడని చెప్తారు స్థానికులు. కొండ మీద నుంచి నీళ్లు గుడి మీద పడుతుంటాయి. గంగమ్మ శివుడి తలపై ఉందనడానికి ఇదే నిదర్శనం అని చెప్తారు. గుడికి దగ్గరలోనే పెద్ద కొలను ఉంటుంది. ఈ దేవాలయం గుహ లోపలికి చొచ్చుకొచ్చినట్టు ఉండటంతో ఇక్కడ ఎండ పడదు.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి దాదాపు 185 కిలోమీటర్ల దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోవడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి. ప్రభుత్వ వాహనాలు, ప్రయివేట్ రవాణా సౌకర్యాలు కలవు. స్నేహితులు, కుటుంబంతో కలిసి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు.