calender_icon.png 17 June, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణదాతలం కావాలి!

14-06-2025 12:00:00 AM

రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాలలో శస్త్రచికిత్సల వేళ రక్తం అవసరమవుతుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్య లో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 14న ‘ప్రపంచ రక్త దాతల దినం’ జరుపుకుంటాం. రక్త వర్గాలను కార్ల్ ల్యాండ్‌స్టీనర్ కనుగొన్నారు. 1975లో స్వరూప కృష్ణన్, డా. జేజీ జొలీల చొరవతో ఈ ప్రత్యేక దినం ప్రారంభమైంది.

ఈ రోజు రక్త దానాన్ని ప్రోత్సహిస్తూ దీని ఆవశ్యకతను తెలియచేయడాన్ని ముఖ్య కార్యక్రమంగా నిర్వహిస్తారు. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు, యువతకు రక్తదానంపై సరైన అవగాహన లేదు. రక్తం దానం చేస్తే నీరసించి పోతామని, బలహీనపడతామని అపోహ వారిలో ఇంకా బలంగా ఉంది.

వివిధ స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్ లాంటివి గ్రామాలు, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి రక్తాన్ని సేకరిస్తున్నారు.  చాలామంది యువత రక్తదానం అంటేనే రెండడుగులు వెనక్కి వేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కొంతవరకు కారణంగా చెప్పాలి. 

ప్రతి ఆరోగ్యవంతుడిలో సుమారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వారెవరైనా రక్తదానం చేయవచ్చు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు ఒకసారి (సంవత్సరానికి నాలుగుసార్లు) రక్తదానం చేయవచ్చు. అయితే, 45 కిలోల బరువుకు పైన ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి నుంచి రక్తదాత 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు.

రక్తదానం చేసే వ్యక్తికి వైద్యుల సంరక్షణలో కొన్ని వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. హెపటైటిస్‌బి, హెచ్‌ఐవి, రక్తహీనత, బలహీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు వంటివాటితో బాధపడేవారు రక్తదానం చేయడానికి అనర్హులు. ఒకవేళ తెలియక అలాంటి వారు చేసినా వారి రక్తం ఉపయోగపడదని వైద్యులు అంటారు. రక్తదానం చేసిన వారికి పూర్తిస్థాయిలో రక్తం 21 రోజుల్లో తిరిగి ఉత్పత్తవుతుంది. రక్తంలో మొత్తం 8 గ్రూపులు ఉన్నాయి.

4 నెగెటివ్, నాలుగు పాజిటివ్ గ్రూపులు. రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 184 ద్వారా ఆ రోజు స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరవుతుంది. ప్రపంచంలో ఓఫూవూ వారే అధికంగా ఉన్నారు. ఒక యూనిట్ సుమారు 500 మిల్లీలీటర్లు రక్తంతో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం చేసేవారు మిగతా వారికన్నా చాలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.

ప్రతి ఏటా వందలాది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ వేల యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో రక్తదాన కేంద్రాలు ఉన్నాయి. అనేకమంది తమ జన్మదినాలు, పెళ్లిరోజులను పురస్కరించుకొని కూడా రక్తదానం చేస్తుంటారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులలో కల్తీ రక్తాన్ని విక్రయిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

రెడ్‌క్రాస్, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలలో నామమాత్రపు డబ్బులతో రక్తం విక్రయిస్తున్నారు. సమాజంలో ఇప్పటి వరకు రక్తదానం చేయనివారు అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్యలో రక్తదానం చేసిన వారికి విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో సముచిత స్థానం కల్పించాలి. రక్త దాతలను ప్రభుత్వం సముచితంగా గుర్తించగలగాలి.

కామిడి సతీష్‌రెడ్డి