14-06-2025 12:00:00 AM
అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం భరతావనిని నివ్వెర పరిచింది. దేశ పౌర విమానయాన రంగం చరిత్రలో ఇంత పెద్ద విషాదం ఎప్పుడూ జరగలేదు. ఎయిర్ ఇండియా బోయింగ్ లండన్కు వెళ్లేందుకు బయలుదేరిన కొన్ని నిమిషాలకే కుప్పకూలి పోవడం అందరినీ నివ్వెర పరిచింది. అందులో విమాన సిబ్బందితో కలిపి 242 మంది ప్రయాణీకులుండగా, ఒకరే బతికి బయట పడటం అందరి మనసును కలచి వేసింది.
ఈ ఘోర దుర్ఘటనకు తోడు విమానం అక్కడి మెడికల్ కాలేజీ హాస్టల్పై పతనం కావడం మరో దురదృష్ట ఘటన. మెస్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికోలు ఎంతమంది ఆ మంటలకు ఆహుతయ్యారో విమాన దుర్ఘటన జరిగిన రోజు తెలియరాలేదు. ఇది ఊహకందని పెను విషాదమని ప్రధాని మోదీ తమ సంతాప సందేశంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ దొరికింది.
దానిని విశ్లేషిస్తేగాని, ఈ ప్రమాదానికి కారణాలు వెల్లడి కావు. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. విమానంలో లక్షా 25 వేల లీటర్ల ఇంధనం ఉండటం వల్ల అది కూలినప్పుడు ఎగసిన మంటల్లో అక్కడి ప్రాంతమంతా మసిబొగ్గుగా మారింది. ప్రయాణికులు కాలిపోవడంతో వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నది. విమాన ప్రమాదంపై ఇప్పుడు జరిపే విచారణ చాలా కీలకం కానున్నది.
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 నిర్వహణ లోపాలపై ఇంజినీర్లు గతంలోనే హెచ్చరికలు చేశారు. నిజానికి, ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణపై గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు ఒక కోటి చొప్పున టాటాలు పరిహారం ప్రకటించారు. అయితే, ఆ పరిహారం కుటుంబాల్లోని బాధను తొలగించలేదు.
భారత విమానయాన రంగం సత్వరంగా విస్తరిస్తున్నది. దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరుగుతున్నది. అందుకు అనుగుణంగా ప్రయాణికుల భద్రతకు కూడా అధిక ప్రాధాన్యాలు ఇవ్వాల్సి వుంటుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ల ఇంధన, ఇంజిన్ విభాగాలను ఎప్పటి కప్పుడు తనిఖీ చేయడం తప్పనిసరి చేయాలి.
కొవిడ్ సమయంలో విదేశాల్లోని భారతీయులను స్వదేశం తీసుకు వస్తున్నప్పుడు 2020లో చివరిసారి మన దేశంలో విమాన ప్రమాదం జరిగింది. జోరుగా కురుస్తున్న వర్షంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కేరళలోని కొజికోడ్లో దిగుతున్నప్పుడు లోయలో పడి రెండు ముక్కలైంది. అప్పుడు ఇద్దరు పైలట్లు సహా 18 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ ఒకవైపు భయపెడుతుండగా స్వదేశానికి వచ్చినవారు మృత్యు కౌగిలిలోకి వెళ్లడం అప్పుడు అందరినీ కలచివేసింది.
ఇలాంటి ప్రమాదాలను నివారించలేమా అనే ప్రశ్న ఎప్పటి కప్పుడు ముందు నిలిచినా, పౌరయానం ఒక పరిశ్రమగా ఎదుర్కొంటున్న సవాళ్ల ముందు అవి ప్రశ్నలుగానే మిగిలి పోతున్నాయి.
ప్రయాణికుల సంఖ్య, విమానయాన సంస్థల సిబ్బంది అనే గణాంకాలతోనే పౌర విమానయాన పరిశ్రమ అభివృద్ధిని కొలిస్తే సరిపోదు. ఒక ప్రయాణికుడు అంటే ఒక కుటుంబంతో ముడిపడ్డ సంబంధం. ఒక ప్రయాణికుడు మరణిస్తే ఒక కుటుంబం చితికి పోతుందనే వాస్తవాన్ని విమానయాన సంస్థలు గుర్తించాలి.