5 July, 2026 | 2:24 PM

గంజాయిపై ఉక్కుపాదం మోపాలి

12-09-2025 01:15 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 11 ( విజయక్రాంతి ): యువత గంజాయి బారిన పడకుండా  పటిష్ట చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

గురువారం  మినీ మీటింగ్ హల్ లో  జిల్లా లో గంజాయి నియంత్రణ పై నిర్వహించిన సమావేశంలో జిల్లా అడిషనల్ డీసీపీ  లక్ష్మీనారాయణ, జిల్లా రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డి,మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, పోలీస్ శాఖల, ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వివిధ రకాల మాదకద్రవ్యాలపై 35 కేసులు నమోదు చేయడం జరిగిందని, 75 మందిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.డ్రగ్స్ వినియోగ ప్రాంతాలను గుర్తించాలన్నారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయం చేసుకుంటు గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్నారు.

మత్తు పదార్థాలకు బానిస కాకుండా, యువత వాటి వల్ల కలిగే నష్టాలను తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరసింహారావు,జిల్లా వైద్య శాఖ అధికారి మనోహర్,  తదితరులు పాల్గొన్నారు.