19-06-2025 12:00:46 AM
బనకచర్లపై అఖిలపక్ష రివ్యూ తర్వాత..
ఎంపీలు డీకే అరుణ, రఘునందన్రావు..
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని బీజేపీ ఒప్పుకోదని ఎంపీలు డీకే అరుణ(MP DK Aruna), రఘునందన్ రావు(MP Raghunandan Rao) స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీల సమావేశానికి హాజరైనట్టు వారు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చర్చించిన విషయాలను బీజేపీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కేంద్ర జల్శక్తి మంత్రి ఇప్పటికే కిషన్రెడ్డిని కలిసి వివరించారని డీకే అరుణ తెలిపారు. మున్ముందు తాము కూడా ఎంపీలుగా కేంద్రమంత్రిని కలిసి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరిస్తామని పేర్కొన్నారు.
గోదావరి నదిలో తెలంగాణ వాటా నీటి కేటాయింపుల్లో ఎంత మేర వాడుకున్నామో, గోదావరి నదిపై పూర్తికావాల్సిన ప్రాజెక్టులెన్ని.. ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు.. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదు.. అనే విషయాలపై వివరాలు అడిగామన్నారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోందని డీకే అరుణ తెలిపారు.