03-08-2025 02:20:15 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లాను క్రీడా హబ్ గా మారుస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు(MLA K. R. Nagaraju)లు సంయుక్తంగా తెలిపారు. ఆదివారం హనుమకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్లో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్ 20 కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వారు పాల్గొని, పరుగు పందెం, లాంగ్ జంప్ క్రీడలను జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, జిల్లాలో క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తూ క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
ఈ ఏడాది నుంచి క్రీడ తరగతులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వైద్యం, విద్య, వ్యవసాయంతో పాటు క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి అశోక్, క్రీడా ప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో విజయాలు సాధించిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.