calender_icon.png 15 November, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ డెన్ ఎవరిదో?

14-11-2025 12:01:29 AM

 నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా తొలి టెస్ట్

-శుభారంభం కోసం ఇరు జట్ల ఆరాటం

-ఈడెన్ పిచ్‌పై సర్వత్రా ఆసక్తి

కోల్‌కత్తా, నవంబర్ 13 : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో మరో కీలక సిరీస్‌కు భారత్ రెడీ అయింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ శుక్రవారమే ఆరంభం కాబోతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. డబ్ల్యూటీసీ 2025 సైకిల్‌లో భారత్‌కు ఇది మూడో సిరీస్. ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేసిన టీమిండియా తర్వాత స్వదేశంలో విండీస్‌ను 2 క్లీన్‌స్వీప్ చేసింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూ డో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఇప్పు డు సౌతాఫ్రికాపై సిరీస్ గెలిస్తే అగ్రస్థానానికి చేరువవుతుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో శుభారంభం కోసం ఉవ్విళ్ళూరుతోంది. శుభమన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడూ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. గత రికార్డుల పరం గానూ, బలాబలాల పరంగానూ చూస్తే సఫారీలపై భారత్‌దే పైచేయి.

అయితే డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకోలేం. టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే భారత్ కూడా ఈ మ్యాచ్‌కు అత్యుత్తమ టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. ఈడెన్ టెస్ట్ కోసం భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసినట్టే. ఫైనల్ ఎలెవెన్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు ఆడడం ఖాయమైంది. పంత్ వికెట్ కీపర్‌గానూ, జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గానూ ఆడనున్నారు. నితీశ్‌రెడ్డిని స్కాడ్ నుంచి రిలీజ్ చేయడంతో జురెల్‌కు లైన్ క్లియర్ అయింది.

ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్, మూడో స్థానంలో సాయి సుదర్శన్, తర్వాత గిల్, పంత్, జురెల్ బ్యాటింగ్‌కు వస్తారు. ఆల్‌రౌండర్ కోటాలో జడేజా, వాషింగ్టన్ సుందర్, ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. పేస్ విభాగంలో బుమ్రాతో పాటు సిరాజ్‌కు చోటు ఖాయం. అయితే కుల్దీప్‌ను పక్కన పెడితే మాత్రం అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు. కుల్దీప్, అక్షర్ పటేల్‌లో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా పెద్ద సవాల్‌గా గిల్ అభివర్ణించాడు. అలాగే వైట్‌బాల్ సిరీస్ ఆడిన వెంటనే రెడ్‌బాల్ ఫార్మాట్‌కు తగ్గట్టు సిద్ధమవడం మరో ఛాలెంజ్‌గా చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇటీవలే పాకిస్తాన్‌తో టెస్ట్ 

సిరీస్‌ను సమం చేసిన సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న సఫారీలను బవుమా నడిపిస్తున్నాడు. పలువురు కొత్త ఆటగాళ్లు జట్టు లోకి రాగా, సీనియర్లు కూడా ఉన్నారు. బ్యాటింగ్‌లో మార్క్‌క్రమ్, స్టబ్స్, రికెల్టన్‌పై అంచనాలున్నాయి. అటు బౌలింగ్‌లో రబా డా, మార్కో జెన్సన్ పేస్ ఎటాక్‌లో కీలకం కానుండగా.. స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. ముత్తుసామి, కేశవ్ మహారాజ్, హార్మర్ పాక్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించారు.

గత రికార్డులు :

టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి ఓవరాల్ రికార్డుల్లో భారత్‌పై సఫారీలదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 44 సార్లు తలపడగా సౌతాఫ్రికా 18 టెస్టుల్లో, భారత్ 16 టెస్టుల్లో గెలిచాయి. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిసా యి. స్వదేశంలో మాత్రం భారత్ ఆధిప త్యం కనబరిచింది. ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్ 11 సార్లు, దక్షిణాఫ్రికా 5 సార్లు గెలిస్తే, 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.

పిచ్ రిపోర్ట్ : 

ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై ఈ సారి అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. తొలి టెస్టుకు స్పోర్టింగ్ వికెట్ రూపొందించాలని క్యూరేటర్‌కు సూచించాడు. ఈడెన్ పిచ్ తొలి రెండు రోజులు స్వింగ్ బౌలర్లతో పాటు బ్యాటర్లకు అనుకూలం. ఇక చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం కనబరిచే అవకాశముంది.

భారత తుది జట్టు (అంచనా) :

జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్(కెప్టెన్), పంత్(కీపర్),జురెల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా

సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)

మార్క్‌క్రమ్, రికెల్టన్, స్టబ్స్, జోర్జి, బవుమా(కెప్టెన్), వెరిన్నె (కీపర్), ముత్తుసామి, హార్మర్, జెన్సన్, కేశవ్ మహారాజ్, రబాడ