07-09-2025 12:48:34 AM
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..
ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్లి ఏడు చేపలను వేటాడారు.
ఎన్నో అసహజాలు, అసంగతాలయిన సన్నివేశాలు ఉన్నా..
రీజనింగ్ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ..
నిజానికి రాజు గారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.
అడవికి పోయి క్రూరమృగాలను వేటాడవచ్చు కదా!
అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు.
చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.
వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా..
నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్ ప్రశ్నే..
అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు.
అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి..
రాజుగారు అంటే మనిషి..
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్లడమూ అంటే..
మనిషి జీవితాన్ని కొనసాగించడం.
జీవితమే ఒక వేట.
వేటే ఒక జీవితం.
రాజకుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే ..
మనిషికి ఉండే అర్షిడ్ వర్గాలు (అనగా 6 )
1. కామ
2. క్రోధ
3. లోభ
4. మోహ
5. మద
6. మాత్సర్యాలు
వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు..
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు.
రాజు గారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
ఏమిటా చేప.?
అది మనస్సు దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు.
మనస్సు అంటే ఏమిటి..?
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు.
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవిత కాలం చాలదు.
కోరికలన్నింటినీ జయించేసి మోక్షానికి వెళ్లిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
మోక్షానికి వెళ్లాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డుతగులుతున్నది ఏది..?
గడ్డిమేటు.
గడ్డిమేటు అంటే ఏమిటి.?
కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించాలంటే ఎలా..?
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డి పరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు.
జ్ఞానదాయకమైన మాటలు ఎంతచెప్పినా, ఎన్నిచెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డి పరకలను లాగినట్టే.
ఆ కుప్ప తరిగేది కాదు. తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే
ఏం చేయాలి!!
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడనుంచి రావాలి.?
అసలు..
ఆవు అంటే ఏమిటి.?
ఆవు అంటే #జ్ఞానం.
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే..
అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు.
(జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం)జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును ఎవరు మేపాలి.?
గొల్లవాడు మేపాలి.. గొల్లవాడు అంటే ఎవరు..?
సమర్థ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా..
అర్జునుడు అనే దూడను అడ్డుపెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికీ ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా.. ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు..?
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ.
ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
ఓ జగన్మాతా..
ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు..?
ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు..?
వాడికి చీమ కుట్టింది.
ఎక్కడిది చీమ.?
దానికి ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడి కన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్లవాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టకపోవడం వలన తన విధిని నిలిపివేశాడా..?
లేదు..
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్టరక్షణను చేసుకున్నాడు.
చీమ కుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే..
సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం.
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి.
ఏమిటీ ఈ పుట్ట?
మనిషికి ఉండే సంసారంఒక పుట్ట.
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగుపెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు మన బాల్యంలోనే..
ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.