పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా
విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసిన ర్యాకల శ్రీనివాస్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పట్ల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఔదార్యం చాటారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెడ్పీహెచ్ఎస్ వారి సహకారంతో శ్రీనివాస్ నోట్బుక్స్ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పాఠశాల అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, రిటైర్ట్ ఉపాధ్యాయుడు ఎండీ సలీమ్, అసోసియేషన్ అధ్యక్షుడు పక్కిరు కొండల్రెడ్డి, మాజీ సర్పంచ్ బొమ్మరపు సురేశ్, గ్రామకార్యదర్శి వెంకటేశ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓరుగంటి రమేశ్, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.






