ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లవ్స్టోరీతో..
దర్శకుడు సందీప్ రాజ్ మరో భావోద్వేగభరితమైన కథతో వస్తున్నారు. ‘మోగ్లీ 2025’ అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్నాడు. సాక్షి సాగర్ మదోల్కర్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతోంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ లవ్స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు సందీప్రెడ్డి వంగా క్లాప్ కొట్టారు. మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత విశ్వప్రసాద్ స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం సమకూర్చనుండగా, రామమారుతి ఎం సినిమాటోగ్రఫీ, పవన్కల్యాణ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించి, వేసవిలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






