12-10-2025 03:39:40 AM
మెదక్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): చేతులు కట్టేసి, వివస్త్రను చేసి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు.. ఆపై హత్య కు యత్నించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని చిన్నఘనాపూర్ శివారు ఏడుపాయలకు వెళ్లే మార్గం లో శనివారం వెలుగులోకి వచ్చింది. మెదక్ మండలానికి చెందిన మహిళ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి మెదక్లో అడ్డా కూలికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని దుండగులు ఆమెను ఏడుపాయల వైపు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మహిళను వివస్త్రను చేసిన దుండగులు.. రెండు చేతులను కట్టేసి దాడికి పాల్పడి, చంపేందుకు యత్నించారని తెలుస్తున్నది.
శనివారం ఉదయం మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసన్నకుమార్, కొల్చారం ఎస్సై మొయినుద్దీన్, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. మహిళను పోలీసు వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.