calender_icon.png 3 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు రిక్తహస్తం!

02-06-2025 02:43:44 AM

  1. సోనియా, మీనాక్షినటరాజన్ ఉన్నా కాంగ్రెస్ కమిటీల్లో సరైన దక్కని ప్రాతినిధ్యం 
  2. ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన ఐదు కమిటీల్లో ఆరుగురికే చోటు  
  3. చట్టసభల్లో 33 శాతం మహిళలే ఉండాలన్న రాహుల్‌గాంధీ 
  4. సొంత పార్టీ పదవుల్లో మహిళలను విస్మరించడంపై విమర్శలు
  5. పీఏసీలో సీనియర్లను పక్కనపెట్టడంపై తీవ్ర అసంతృప్తి  
  6. పీసీసీ కార్యవర్గం కూర్పులోనైనా న్యాయం చేయాలని మహిళల డిమాండ్

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవలే ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఐదు కమిటీలపై పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మహిళలకు పార్టీ పదవుల విషయంలో పూర్తిగా నిరక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు.

ఢిల్లీలో సోనియాగాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షినటరాజన్ ఉన్నప్పటికీ.. ఏఐసీసీ ప్రకటించిన ఐదు కమిటీల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా మొండిచెయ్యి చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మహిళలకు చట్టసభల్లో 33శాతం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజ ర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్‌చేస్తున్నారు. కానీ తమ పార్టీ పదవుల విషయం లో మాత్రం మహిళలకు 33 శాతం ఎందుకు అమలుచేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

గత శుక్రవారం ప్రకటించిన ఐదు కమిటీల్లో  మొత్తం 66మంది ఉండగా, మహిళలకు ఆరుగురికి మాత్రమే చోటివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ‘మహిళల ఓట్లు కావాలి.. మహి ళలు పార్టీ కోసం పనిచేయాలి.. పదవుల పంపకం వచ్చేసరికి చిన్నచూపా’ అని నారీమణులు మండిపడుతున్నారు. 

ఒకవైపు మహిళలకు కమిటీల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆవేదనతో ఉండగానే మరోవైపు రాజకీయ వ్యవహారాల కమిటీలో సీనియర్ నాయకులను పక్కనపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఒకరిద్దరు నాయకులకు రెండు కమిటీల్లో అవకాశం కల్పించడం.. కొందరు సీనియర్ నాయకులు, కొందరు మంత్రులను పక్కనపెట్టడం ఏంటనీ..? ప్రశ్నిస్తు న్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగా భావించే రాజకీయ వ్యవహారాల కమిటీని 22మందితో ప్రకటించగా, మహిళల నుంచి మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిలకు  మాత్రమే అవకాశం కల్పించారు.

మిగతా 20మందిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,  మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, నాయకులు షబ్బీర్‌అలీ, అజారుద్దీన్, ప్రభు త్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు జెట్టి కుసుమకుమార్, ఈరవత్రి అనిల్ ఉన్నారు.

అయి తే ఈ రాజకీయ వ్యవహారాల కమిటీలో మిగతా మంత్రులు  కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు చోటు ఇవ్వక పోవడంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు పీఏసీలో పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలకు కూడా చోటు ఉండే ది, కానీ ఇటీవల ప్రకటించిన కమిటీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, జానారెడ్డిని విస్మరించడపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 ఇక పీసీసీ సలహాదారు (అడ్వయిజరీ)కమిటీని 15మందితో ప్రకటించినప్పటికీ.. మహిళల నుంచి మాజీమంత్రి గీతారెడ్డికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ కమిటీలోనూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, సీఎం సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, జగ్గారెడ్డి, జాఫర్ జావెద్, మాజీమంత్రి  జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ఉన్నారు.

అయితే ఈ కమిటీలో మహిళల నుంచి గీతారెడ్డికి చోటు ఇవ్వగా, ఆమె కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ గీతారెడ్డితోపాటు మ రొకరికి అవకాశం కల్పిస్తే బాగుండేదనే అభిప్రాయం కాంగ్రెస్ మహిళా నేతల నుంచి వ్యక్తమవుతోంది.   రాజ్యాంగ పరిరక్షణ కమి టీ (సంవిధాన్ బచావో)ను 16మందితో ప్రకటించగా, అదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఓటమి చెందిన అత్రం సుగుణ, జూలూరి ధనలక్ష్మికి మాత్రమే అవకాశం ఇచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణ కమిటీలో పీ వినయ్‌కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే శంకరయ్య, బాలునాయక్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పార్టీ నాయకులు రాచమల్ల సిద్దేశ్వర్, కే సంతోష్, పులి అనిల్‌కుమార్, మాజిద్‌ఖాన్, జీ రాము లు, అర్జున్‌రావు, శౌరీ, కే వల్లభరెడ్డి, వీ శ్రీ కాంత్‌రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

డీలిమిటేషన్ కమిటీని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురితో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన కమిటీలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని మాత్రమే నియమించారు. ఈ కమిటీ లో వంశీచంద్‌రెడ్డి, గద్వాల విజయలక్ష్మితో పాటు  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పవన్ మల్లాడి, డీ వెంకటరమణ ఉన్నారు.

క్రమశిక్షణ కమిటీలో దక్కనిచోటు.. 

 ఇదిలాఉండగా పార్టీలో అత్యంత కీలకమైన పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మహిళలను పూర్తిగా విస్మరించారు. పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి చైర్మన్‌గా, పార్టీ సీనియర్ నేత శ్యామ్ మోహన్ వైస్‌చైర్మన్‌గా ఉండగా, నిరంజన్‌రెడ్డి, కుమార్‌రావు, జాఫర్ జావెద్, జీవీ రామ కృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఆరుగురితో నియమించిన ఈ కమిటీకి అర్హులైన మహిళలు పార్టీలో దొరకడం లేదా..? అనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

ఇటీవలనే పీసీసీ మహిళా విభాగం అధ్య క్షురాలు సునీతారావు కూడా పార్టీకోసం కష్టపడిన మహిళలకు పదవు ల్లో అవకాశం కల్పించాలని గాంధీభవన్‌లోనే ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది.