22-09-2025 12:58:25 AM
-రాష్ట్రమంతా సౌభాగ్యంగా ఉండాలి
-బతుకమ్మ పండుగతో సుఖశాంతులు పెంపొందాలి
-వరంగల్ బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రకృతిలో లభించే అనేక రకాల పూలతో తొమ్మిదిరోజులపాటు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం రాత్రి వరంగల్లో తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనతో పాటు, వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభమైందని చెప్పారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారని, గౌరమ్మను ఎంతో భక్తితో పూజిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా ఎదగడంతో పాటు శక్తిమంతులుగా కావాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అంతకముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మపై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, కలెక్టర్ స్నేహా శబరీశ్, సీపీ సన్ప్రీత్సింగ్, కమిషనర్ చాహత్ వాజ్పేయీ, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య అలేఖ్య పుంజాల తదితరులు పాల్గొన్నారు.