శ్రీరామ నవమి వేడుకల పనులు ప్రారంభం
సూర్యాపేట, మార్చి 8 (విజయక్రాంతి): ఈనెల 19 నుండి 28 వరకు బొడ్రాయి బజార్ లో గల శ్రీ వేదాంత భజన మందిరములో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి నవరాత్రి ఉత్సవములు 74వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం భక్తులు పసుపు కొట్టి శ్రీరామ నవమి వేడుకల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది పాల్గొని పసుపు కొట్టి ఉత్సవాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన వేదాంత భజన మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అందులో భాగంగా పసుపు కొట్టే కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నవమి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
అంతకుముందు దేవాలయ ప్రధాన అర్చకులు ధరూరీ సింగరాచార్యులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, సోమ సుమన్, ధరూరి రాఘవచార్యులు, గోదాదేవి, ప్రేమలత, హైమావతి, శోభారాణి, కక్కిరేణి పద్మ, గుండా సుధామాధురి, సుగుణమ్మ పాల్గొన్నారు.




