12-01-2025 12:00:00 AM
ఐటి విప్లవం వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగుల పనిగంటలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే ఐటీ రంగంలో వారానికి అయిదు రోజులే పనిచేస్తారు. పైగా మంచి జీతాలు ఉండడంతో ఎక్కువ గంటలు పని చేయడానికి సిద్ధపడుతున్నారు. అయి నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామన్న అసంతృప్తి వాళ్లలో గూడుకట్టుకు పోతోందని మానసిక వైద్యులు అంటున్నారు.
పని, జీవితం మధ్య బ్యాలెన్స్ కోల్పోవడంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న వేళ వారానికి 90 గంటలు పని చేయాలంటూ ఎల్అండ్టీ సంస్థ చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోను, ఇటు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సంస్థ ఉద్యో గుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు వీలయితే ఆదివారాలు కూడా పని చేయాలని సూచించారు. ‘ఆది వారం రోజంతా పెళ్లాం ముఖం చూస్తూ ఏం చేస్తారు. దానికి బదులు ఆఫీసుకు వచ్చి పని చేయొచ్చు కదా’ అంటూ కూడా ఓ ఉచిత సలహా పడేశారు. దీంతో నెటిజన్లు ఆయనతో ఓ ఆట ఆడేసుకున్నారు. ముఖ్యంగా భార్యల గురించి సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా జ్వాల, దీపికా పదుకోనే లాంటి మహిళా సెలబ్రిటీలు మండిపడుతున్నారు.
కుటుంబ సంతోషం, ఉద్యోగుల శ్రేయస్సు గురించి ఆలోచించే మనస్తతం ఆయనకు లేనట్లు ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ వర్గాలు సైతం సుబ్రహ్మణ్యన్ అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు. ప్రతి వ్యక్తికీ కుటుం బం కూడా ముఖ్యమేనని, వర్క్ను, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోకపోతే సమస్యలు వస్తాయని సైతం అంటున్నారు.
‘వర్క్ హార్డ్’ అంటే ఎక్కువ గంటలు పని చేయడం కాదని, కష్టపడి పని చేయడం, నాణ్యమైన ఫలితాలు సాధించడం అని మరికొందరు సూచిస్తున్నారు. నిజానికి మన దేశంలో వారానికి 48 గంటలకు మించి పని చేయడాన్ని ఓవర్టైమ్గానే పరిగణిస్తారు. అలాంటప్పుడు ఆదివారాలు కూడా పని చేయాలని ఎల్అండ్టీ అధినేత చేసిన సూచన జనానికి నచ్చలేదు.
అంతేకాదు ఆయనం త జీతం ఉంటే ఆదివారాలే కాదు, వారానికి ఎనిమిది రోజులూ పని చేస్తామంటూ కడుపుమండిన ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. దేశంలో దిగ్గజ కంపెనీల్లో ఒకటయిన ఎల్అండ్టీ అధినేత వార్షిక వేతనం 52 కోట్లకు పైమాటే. ఇవికాకుండా బోలెడు ప్రోత్సాహకాలూ ఉంటాయి. దీన్ని దృష్టి లో పెట్టుకునే ఆ నెటిజన్ తన ఆక్రోశం ఈ విధంగా వెళ్లగక్కి ఉంటారు.
కార్పొరేట్ రంగంలోని ప్రముఖులు కూడా ఈ సూచనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. కష్టపడడంతో పాటు తెలివిగా పని చేయడాన్ని తాను నమ్ముతానని హర్ష్ గోయంకా అభిప్రాయపడితే, ‘మీకు 90 గంట ల వారం కావాలంటే పైనుంచి ప్రారంభించండి’ అని బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ సలహా ఇచ్చారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై రాజుకొంటున్న రచ్చ చూసిన ఎల్అండ్ టీ దీనిపై ఒక ప్రకటనకూడా చేసింది.
అసాధారణ ఫలితాలకు అసాధారణ కృషి అవసరమని, చైర్మన్ వ్యాఖ్యలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయని అంటూ వెనకేసుకు వచ్చింది. చైనావాళ్లు వారానికి 90 గంటలు, అమెరికన్లు 50 గంటలే పని చేస్తారని ఓ చైనా వ్యక్తి అన్న మాటలను గుర్తు చేసుకునే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. నిజానికి సుబ్రహ్మణ్యనే కాదు వారానికి ఎక్కువ గంటలు పని చేయాలని ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వ్యాఖ్యానించారు.
వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకు డు నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. నిరుద్యోగంతో పాటు పనికి తగిన వేతనాలు లేని మన దేశంలో ఇలాంటి సూచనలను హర్షించగలరా? అలాంటి వాతావరణం రావాలంటే ఇప్పట్లో సాధ్యమా? అనేదే ప్రశ్న. అంతవరకు ఇలాంటి సూచనలు ఎవరు చేసినా రాద్ధాంతం తప్పదు.