జనసంద్రంగా యాదగిరి క్షేత్రం
ఎండలు వేడిమి ని లెక్కచేయని భక్తులు
కొండ కింద రింగురోడ్డులో ఎటు చూసినా వాహనాలే
ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటలు
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): వేసవికాలం వీకెండ్ ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం సాయంత్రం నుండే వాహనాల రద్దీ తో యాదగిరిగుట్ట లో రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు యాదగిరి కొండ భక్తులతో కిటకిటలాడింది. వేసవికాలం ఎండలు మండుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది.
కొండ కింద రింగురోడ్డు వాహనాలతో క్రిక్కిరిసిపోయింది. కొండపైన వాహనాలు రద్దీ పెరగడంతో కొండకింది నుండి కొండపైకి వాహనాలను అనుమతించలేదు. కొండపైకి మెట్ల దారి వెళ్లే భక్తులు ఉదయం నుండి 10 గంటల వరకు రద్దీ కనిపించింది. ఆ తర్వాత ఎండ వేడి ఉక్కపోతతో బస్సులను ఇతర వాహనాలను ఆశ్రయించినారు. ఉదయం నుండి రాత్రి వరకు కొండపైన ఆలయ పరిసరాలు, శివాలయం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ప్రసాద విక్రయశాలల్లో క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. స్వామివారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలను పండితులు నిర్వహించారు.






