20 August, 2026 | 1:50 PM

మియాపూర్‌లో దురదృష్టకర సంఘటన

23-06-2026 08:46 PM

- ఫోన్ మాట్లాడుతూ టెర్రస్‌పై నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరీ నగర్‌లో బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఫోన్‌ మాట్లాడేందుకు టెర్రస్‌పైకి వెళ్లిన 20 ఏళ్ల యువతి అదుపు తప్పి కిందపడి మృతి సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుద్ధ వెంకటప్రతాప్ రెడ్డి-ప్రశాంతి దంపతుల కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20) ఈ సంఘటనలో మృతి చెందింది.

అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులతో కలిసి ఇటీవల మయూరీ నగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్‌లో మాట్లాడుతూ ఐదో అంతస్తు టెర్రస్‌పై గోడకు ఆనుకొని నిలబడగా, అదుపు తప్పి కిందపడింది. ఇది గమనించిన వాచ్‌మ్యాన్ తల్లి ప్రశాంతికి సమాచారం ఇవ్వడంతో కూతురిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే ప్రాణమ్య డిగ్రీ కోర్సు ఆన్‌లైన్‌లో చదువుతోంది, అమ్మమ్మ ఇంటికి వచ్చి కొన్ని రోజులు గడిపిన తర్వాత రెండు మూడు రోజుల్లో వేరే  ఫ్లాట్‌లోకి మారాల్సి ఉందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ టెర్రస్ రైలింగ్ ఎత్తు,సేఫ్టీ చర్యలపై పోలీసులు పరిశీలిస్తున్నారు.