యూత్ కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాను చిబ్కు బెయిల్
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో(India AI Impact Summit 2026) నిరసనకు సంబంధించి ఇండియన్ యూత్ కాంగ్రెస్ (Indian Youth Congress) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్కు డ్యూటీ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఉదయ్ భాను పోలీసు కస్టడీని ఏడు రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ కోరినట్లు న్యాయవాది సులైమాన్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు.
మరో ఇద్దరు నిందితులను వరుసగా ఐదు రోజులు, రెండు రోజులు రిమాండ్ చేయాలని కోరుతూ పోలీసులు రెండు వేర్వేరు దరఖాస్తులను దాఖలు చేశారు. చిబ్ పోలీసు కస్టడీని పొడిగించడానికి క్రైమ్ బ్రాంచ్ తగిన కారణాలను అందించడంలో విఫలం కావడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఖాన్ పేర్కొన్నారు. బెయిల్ ఆర్డర్లో మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. ఉదయ్ బాను పాస్పోర్ట్, ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించడం సహా కొన్ని షరతులు విధించిన కోర్టు, రూ. 50,000 పూచీకత్తు బాండ్ను కూడా సమర్పించాలని ఆదేశించింది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 20న జరిగిన "చొక్కాలు విప్పి నిరసన"కు సంబంధించి చిబ్తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్(Delhi Police Crime Branch) తెలిపింది.




