11-06-2025 01:12:36 AM
- యూనిట్ల పంపిణీ వాయిదా ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారుల్లో నిరాశ
- సర్కారు ఉత్తర్వుల మేరకు ముందుకెళ్తామంటున్న అధికారులు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65వేల దరఖాస్తుదారులు
సంగారెడ్డి, జూన్ 10(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడిసాయం అందించే దిశగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ చేసింది. అర్హులైన యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో లబ్దిదారులకు సాయం అందించాల్సి ఉండగా పలు ఆరోపణల నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడింది.
ఉమ్మడి జిల్లాలో సుమారు 65 వేల దరఖాస్తులు...
ఉమ్మడి జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా సుమారు 65వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లాలో 20వేలకు పైగా, సంగారెడ్డి జిల్లాలో 25వేల వరకు, సిద్దిపేట జిల్లాలో మరో 20వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి.
లబ్దిదారుల్లో నిరాశ..
ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం యూనిట్ల పంపిణీని వాయిదా వేయడంతో ఆయా కేటగిరీలకు దరఖాస్తులు చేసు కున్న లబ్దిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం అయిదు విడతల్లో అక్టోబర్ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.
దీనిలో భాగంగా మొదటి విడతలో కేటగిరీ-1లో రూ.50 వేలు, కేటగిరీ-2 లో రూ.1లక్ష వరకు ఎంపికైన లబ్దిదారులకు జూన్ 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15 లోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే నెలాఖరులోపు రాయితీ విడుదల చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియ వాయిదా పడటంతో లబ్దిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం స్పష్టమైన సంకేతాలు ప్రభుత్వం ఇవ్వలేక పోయింది. ఈ విషయంపై సంబంధిత అధికారులను అడగగా ప్రభుత్వం నుంచి తదుపరి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని చెబుతున్నారు.
పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే..
ఉమ్మడి జిల్లాలో 1, 2 కేటగిరీల్లో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించి రాష్ట్ర ఆవిర్భావం రోజున లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. కానీ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాతే లబ్దిదారుల జాబితాను ప్రకటించాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మరింత లోతుగా విచారణ చేసి నిజమైన లబ్దిదారులకు మాత్రమే సాయం అందించాలన్న వినతులతో జూన్ 2న ప్రారంభం కావాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.