11-06-2025 12:51:29 AM
నమోదు తప్పనిసరి
మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాల కోసం కొత్తగా అమలు చేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డుల ప్రక్రియ మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో రైతులకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన, పంటల బీమా పథకం పొందడానికి విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ కార్డుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో విశిష్ట గుర్తింపు కార్యక్రమాన్ని ఏఈఓ ల ద్వారా నిర్వహిస్తున్నట్లు డీఏవో చెప్పారు. పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింకు చేయబడ్డ ఫోన్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డు నెంబరు సంబంధిత గ్రామాల క్లస్టర్ ఏ ఈ ఓ కు తెలియజేస్తే ఓటిపి ద్వారా విశిష్ట గుర్తింపు కార్డు నమోదు చేస్తారని చెప్పారు. జిల్లాలో 1,80,227 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయని, ఇప్పటివరకు 43,393 మంది రైతుల వివరాలు విశిష్ట గుర్తింపు కార్డు కోసం నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఈనెల చివరి వరకు మిగిలిన 1,36,834 మంది రైతులు తమ పేర్లను విశిష్ట గుర్తింపు కార్డు కోసం నమోదు చేసుకోవాలని డీఏవో కోరారు.
జిల్లాలో నమోదు వివరాలు
గార్ల మండలంలో 9,173 పట్టా పాస్ పుస్తకం ఉన్న రైతులు ఉండగా, 4,167 మంది రైతులు విశిష్ట గుర్తింపు కార్డు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గంగారంలో 2,055 కు, 783 మంది, కురవిలో 14,326, 4,820,నరసింహుల పేటలో 9,494, 3,090,బయ్యారంలో 6,905, 2,239, కొత్తగూడలో 2,535, 800, మరిపెడలో 22,857, 7,098, డోర్నకల్ లో 13,613, 4,132, గూడూర్ లో 8,023, 2,037, తొర్రూర్ లో 17,522 , 4,445, చిన్న గూడూరులో 5,389, 1,017, పెద్ద వంగరలో 10,122, 1,595, దంతాలపల్లిలో 9,889 1,557, మహబూబాబాద్ లో 18,297, 2,477, నెల్లికుదురులో 16,727, 2,038, కేసముద్రంలో 13,300 రైతులకు 1,098 మంది రైతులు నమోదు చేసుకున్నారు.
గడువు పెంచాలి
కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన విశిష్ట నమోదు సంఖ్య కార్యక్రమ గడువు పెంచాలని రైతుల కోరుతున్నారు. విశిష్ట నమోదు కార్యక్రమం నిర్వహణ కోసం ఈనెల 5న ఏ ఈ ఓ లకు లాగిన్ ఇచ్చారు. 25 రోజుల్లోనే రైతులందరి చేత విశిష్ట సంఖ్య నమోదు చేయించడం ఏ ఈ ఓ లకు భారంగా మారింది. ఓవైపు వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం, ఇంకోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను రైతులకు వివరించడం, క్షేత్రస్థాయి పర్యటనలతో విశిష్ట గుర్తింపు కార్డుల సంఖ్య నమోదుకు ఆటంకంగా మారింది. దీనితో ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాలో 1,80, 227 మంది రైతులు ఉండగా కేవలం 43,393 మంది రైతులు మాత్రమే సోమవారం వరకు నమోదు చేసుకున్నారు. ఇంకా 1,36,834 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉండడంతో, 20 రోజుల గడువు సరిపోదని, మరో నెల రోజుల పాటు పొడిగించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.