మహిళా జర్నలిస్టులపై దాడులు తగదు
- ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఐజేయు, టీయూడబ్ల్యూజే నేతల డిమాండ్
దాడిని ఖండిస్తూ బషీర్బాగ్లో నిరసన
ముషీరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడి, అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) (Telangana State Union of Working Journalists) ఆధ్వర్యంలో హైదరాబాద్లో మంగళవారం రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్ నుంచి బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
డిజిటల్ న్యూస్ మహిళా జర్నలిస్టులు షాహీన్ ఖాన్, నఫీసా ఖాన్పై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే మహిళా జర్నలిస్టుల విభాగం తీవ్రంగా ఖండించింది. మహిళా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐజేయు నేతలు దేవులపల్లి అమర్, వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ, జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.