06-06-2025 09:10:56 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం(Bhu Bharathi New ROR Law)పై రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం జిల్లాలోని నెన్నెల మండలం నర్వాయిపేట, జెండావెంకటాపూర్ గ్రామాలలోని గ్రామపంచాయతీ కార్యాలయాల(Gram Panchayat Office)లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు(Revenue Conferences)ను మండల తహశిల్దార్ మహేందర్, ఉప తహశిల్దార్ ప్రకాష్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులతో భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో (పైలెట్ మండలం అయిన భీమారం మినహా) కార్యచరణ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నూతన చట్టంలో రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అటవీ భూములలో సాగు కొరకు షెడ్యూల్డ్ తెగల వారు చేసుకున్న దరఖాస్తులను అటవీ కమిటీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందన్నారు .గిరిజనులు సాగు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా త్రాగునీటిని అందించడం జరుగుతుందని, నల్లా కనెక్షన్ లేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల నుండి నర్వాయిపేట వరకు ఆర్టీసీ బస్సు నడిపించాలని గ్రామస్తుల అభ్యర్థన మేరకు బస్సు రవాణాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, నూతన రేషన్కార్డు కొరకు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత గల వారికి కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవడంతో పాటు వీధిదీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన ఈ క్రమంలో దాదాపు కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని తెలిపారు. అనంతరం మండలంలోని మైలారం గ్రామంలోని 3221007 నంబర్ గల చౌకధరల దుకాణాన్ని సందర్శించి రేషన్ సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సన్నబియ్యంను ఈ నెల 30వ తేదీ వరకు రేషన్కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సన్నబియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, చౌకధరల దుకాణం వద్ద తమకు కేటాయించిన రేషన్ సన్నబియ్యం తీసుకోవచ్చని తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.