06-06-2025 09:03:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): భూభారతి చట్టం(Bhu Bharati Act) అమలుతో ప్రజల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) తెలిపారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని యాకర్పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు(Bhubharati Village Revenue Conference)లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజల భూ సమస్యలను అధికారులే ప్రత్యక్షంగా గ్రామాలకు వచ్చి స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిన తరువాత భూ రికార్డుల పరంగా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు.
ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు దశల్లో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు తమ భూ సమస్యలపై దరఖాస్తులను సదస్సుల సందర్భంగా సమర్పించాలని, వాటిని అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని కలెక్టర్ వివరించారు. దరఖాస్తులన్నింటినీ రిజిస్టర్లలో నమోదు చేసి, అభ్యర్థులకు రసీదులు అందించాలని అధికారులకు సూచించారు. సదస్సులకు హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్... ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత బడిబాట కార్యక్రమం, పాఠశాల విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై చేపడుతున్న కార్యక్రమాలపై మండల విద్యాశాఖ అధికారులను కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ శ్రీదేవి, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.