19-05-2025 12:00:00 AM
సంగారెడ్డి, మే 18(విజయక్రాంతి): జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సరిపడా సర్వేయర్లు లేకపోవడంతో భూసర్వే పనులకు ఆటంకం కలుగుతుంది. ధరణితో ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు మండల సర్వేయర్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా సర్వేయర్ వచ్చే పరిస్థితి లేదు.
ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 6000 మంది సర్వేలను నియమిం చనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మెదక్, సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా వెల్లడించారు. ప్రైవేట్ సర్వేయర్లతో పాటు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది.
మండలానికి కనీసం ఇద్దరు ఉండేలా...
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లైసెనస్డ్ సర్వే యర్ల నియామకంపై దృష్టి సారించింది. 60 శాతం మార్కులతో గణితం ఓ సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ (సివిల్), డిప్లొమా, బీటెక్ సివిల్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది.
పాత సర్వేయర్లతో పాటు ఆసక్తి గల వారు ఈనెల 17లోపు మీసేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఇందులో అర్హు లైన వారిని ఎంపిక చేసి వారికి ఈనెల 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో మండలానికి కనీసం ఇద్దరు చొప్పున నియమించనున్నట్లుగా తెలుస్తోంది.
మూడు విడతల్లో శిక్షణ ...
ఎంపిక చేసిన వారికి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫిల్ లెవల్లో ట్రెయినింగ్ ఉంటుంది. అనంతరం 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు.
అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్టు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు. అలాంటి వారికి రైతుల భూములను సర్వే చేసేందుకు అధికారికంగా గుర్తింపు లభించనుంది.
సర్వేయర్ల కొరత లేకుండా...
ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సర్వేయర్ల కొరత తీరనుంది. ప్రస్తుతం 28 మండలాలకు గాను 15మంది మండల సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 4,470 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో మండల సర్వే కోసం 4,070, జిల్లా సర్వే కోసం 400 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం తో జిల్లాలో భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ల్యాండ్ మిస్సింగ్, పట్టాదారు పేరు తారుమారు, విస్తీర్ణంలో తేడా వంటి అనేక సమస్యలున్నాయి. దీంతో సర్వే కోసం అందిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి.
దీనికి తోడు రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున వెంచర్లుగా మారుతున్నాయి. నాలా కన్వర్షన్ కోసం సైతం అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లైసెనస్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతంగా సాగే అవకాశముంది.