calender_icon.png 20 November, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుర స్మృతుల బాల్యం మరపులేనిది

20-11-2025 06:57:46 PM

అదనపు కలెక్టర్ నర్సింగరావు..

గద్వాల: ప్రతి ఒక్కరి జీవితంలో బాల్య దశ మరపురాని మధురస్మృతులతో సంతోషాన్ని కలిగిస్తుందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు ముగింపు వేడుకలు గురువారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ చదువుకోవడం బాలల హక్కు అని, బడి మానేసిన పిల్లలందరినీ పాఠశాలలో చదువుకునేలా విద్యార్థులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రపంచంలో నేడు చాలా చోట్ల కొంతమంది చిన్న పిల్లలు రకరకాల వేధింపులకు గురవుతున్నారని, బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న మొదట తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఎలాంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా జీవించే వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, కళా ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రొబిషన్ అధికారి పరుశురాం, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సహదేవుడు, సభ్యురాలు శైలజ, జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యురాలు గ్రేసీ, డిసిపిఓ నరసింహా, తదితరులు పాల్గొన్నారు.