సెల్ఫోన్ దొంగల ముఠా ఆటకట్టు
- కొన్ని రోజులుగా పోలీసుల యాంటీ డెకాయిట్ ఆపరేషన్
పోలీసులకు చిక్కిన దొంగలు
ఆపరేషన్ సమయంలో చోటుచేసుకున్న కాల్పులు
కంటోన్మెంట్, జూన్ 22: ఈస్ట్జోన్ పరిధిలోని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున దొంగల ముఠా హల్చల్ చేసింది. గత కొద్ది రోజులుగా చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ స్నాచింగ్ ముఠా సంచరిస్తుందన్న సమాచారంతో పోలీసులు యాంటీ డెకాయిట్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే చిలకలగూడ పరిధిలోని మెట్టుగూడ బస్స్టాప్ వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో యాంటీ డెకాయిట్ టీం సభ్యుడు అయిన ఓ కానిస్టేబుల్ను ఫుట్పాత్పై నిఘా పెట్టారు. అదే సమయంలో అక్కడికి నలుగురు దుండగులు వచ్చారు.
మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ నుంచి సెల్ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తేరుకున్న కానిస్టేబుల్ వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కొద్ది దూరంలోనే ఉన్న యాంటీ డెకాయిట్ టీం అప్రమత్తమై దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో యాంటీ డెకాయిట్ టీంకు, దొంగల ముఠాకు మధ్య తోపులాట జరిగింది. దీంతో దొంగలను బెదిరించడానికి డెకాయిట్ టీమ్ సభ్యుడు ఒకరు రివాల్వర్ బయటకు తీసి ఫైరింగ్ చేశాడు. ఈ క్రమంలో ఓ దుండగుడికి గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే, వారిని వెంబడించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దొంగలకు, డెకాయిట్ టీం సభ్యులకు జరిగిన తోపులాటలో ఓ పోలీస్ వద్ద ఉన్న రివాల్వర్ మిస్ఫైర్ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు.






