8 April, 2026 | 5:40 PM

20 ఏళ్ల తర్వాత శివసేన భవన్‌లోకి రాజ్ థాకరే

05-01-2026 12:00 AM

మహారాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం

ఎన్నికల ప్రణాళిక ‘వచన నామా’ను విడుదల చేసిన బ్రదర్స్

ముంబై, జనవరి 4 : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాజ్ థాకరే తిరిగి శివసేన భవన్‌లోకి అడుగుపెట్టారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భేదాభిప్రాయాల వల్ల 2005లో శివసేన నుంచి బయటకు వచ్చిన ఆయన ఇన్నేళ్ల తర్వాత తన సొంత గూటికి రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. తన సోదరుడు ఉద్ధవ్ థాకరేతో కలిసి రాజ్ థాకరే ఒకే వేదికపై కన్పించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ చేతులు కలవడం మరాఠ రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది.

రాజ్ థాకరే శివసేన భవన్‌కు చేరుకోగానే ఉద్ధవ్ థాకరే వర్గ నేత సంజయ్‌రౌత్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్ధవ్, రాజ్ థాకరే కలిసి మున్సిపల్ ఎన్నికల ఉమ్మడి మ్యానిఫెస్టో ‘వచన నామా’ను విడుదల చేశారు. మరాఠ అస్తిత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా తాము ఒక్కటయ్యామని ఈ సోదరులు ప్రకటించారు. తమ తండ్రి దివంగత బాలాసాహెబ్ థాకరే ఆశయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2003లో తలెత్తిన వారసత్వ పోరుకు ఈ కలయికతో తెరపడినట్లు కనిపిస్తోంది.