నజరీ నక్ష రూపొందించాలి !
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, జూన్ 4(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు నేతృత్వంలో బుధవారం కలెక్టర్ నివాస సముదాయంలో నజరీ నక్ష (పోలింగ్ కేంద్రాల భౌగోళిక మ్యాప్ ) పై పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని (రెవిన్యూ అధికారులు) ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, పోలింగ్ కేంద్రాల వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బిఎల్ఒలు పోలింగ్ కేంద్రాల భౌగోళిక సమాచారం, సౌకర్యాలు, రవాణా మార్గాల నజరీ నక్ష రూపొందించాలని ఆదేశించారు. నజరీ నక్ష రూపకల్పనలో కొత్త గా ఏర్పడే పోలింగ్ కేంద్రాలకు బిఎల్ఒలను నియమించాలని పేర్కొన్నారు. బిఎల్ఒలు ఓటర్ల ఇంటింటి సర్వే నిర్వహణ, పోలింగ్ కేంద్రాల పెంపు వివరాలు,
కుటుంబ సభ్యులు అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా తీసుకున్న చర్యల వివరాలు అందించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో అవసరాలకు అనుగుణంగా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి బూత్ యొక్క భౌగోళిక స్థితిని ఖచ్చితంగా గుర్తించాలని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పటాన్చెరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి దేవుజా, పటాన్చెరు నియోజవర్గ పరిధిలోని తహసిల్దార్లు, ఎన్నికల సిబ్బందిపాల్గొన్నారు.




