04-06-2025 11:45:02 PM
జిల్లా అదనపు కలెక్టర్ ఎం డేవిడ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్(District Additional Collector M. David) అన్నారు. బుధవారం జిల్లాలోని లింగాపూర్ మండలం గమ్నూరు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి హాజరై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు తమ భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు సమర్పించినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సరస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, పేరు సవరణ, విస్తీర్ణ సవరణ, మిస్సింగ్ సర్వే నెంబర్, నిషేధిత జాబితాలో నమోదైన భూములు వంటి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సిర్పూర్ యు మండలం భూర్నర్ (బి) గ్రామంలో, జైనూర్ మండలం పవార్ గూడ గ్రామంలో చేసిన రెవెన్యూ సదస్సులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రహ్లాద్, అడ భీమ్ రావ్, పెద్దిరాజు, రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.