21-06-2025 02:06:26 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఆర్థిక అభివృద్ధితో పాటు మానవీయకోణాన్ని జోడిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధికి ఓ కొత్త నిర్వచనాన్ని రచిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ మైండ్ స్పేస్ వెస్టిన్ హౌటల్లో శుక్రవారం జరిగిన అసోచామ్ సదరన్ సీఎస్ఆర్ అండ్ సస్టునబిలిటీ కౌన్సిల్ సదస్సు, అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని రాష్ర్ట ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, పర్యావరణ బాధ్యతలతో కూడిన తెలంగాణను నిర్మించేందుకు యావత్ క్యాబినెట్ కట్టుబడి పని చేస్తోందన్నారు. అపార వనరులు ఉన్నా, అసమానతల ప్రపంచంలో జీవిస్తున్నామని తెలిపారు. ట్రికిల్ డౌన్ (ఉన్నతవర్గాల) ఆర్థిక వ్యవస్థలు పనిచేయవని స్పష్టమైందని.. ఇప్పుడు కేవలం లిఫ్ట్ ఆల్ (దిగువన ఉన్న వారికి ప్రయోజనం) ద్వారా అందరినీ అభివృద్ధి చేయాలన్నది అనివార్యమని పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం పునాదిపై నిలవాలన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని.. తమ ప్రభుత్వం ఆ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలు దాతృత్వం కోసం కాకుండా బాధ్యత కోసం కృషి చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేందుకు రాష్ర్టం సరైన వేదిక అన్నారు.
రాష్ర్టంలో కంపెనీలు అనుకున్న లక్ష్యాలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే కాదు, ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేసేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. వాతావరణం బాగుంటుందని, భాషా సమస్య లేదని, మెరుగైన శాంతిభద్రతలు, తక్కువ ధరకు పుష్కలంగా లభించే మానవ వనరులు, అన్నిటికీ మించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉందని తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీపడుతున్నదన్నారు. హెల్త్, ఫార్మా, ఐటీ, ఫుడ్ గ్రైన్స్ వంటి రంగాల్లో తెలంగాణది తిరుగులేని ప్రస్థానమన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, నిర్వాహకులు సురేశ్ చుక్కపల్లి, బారుల్ ఇస్లాం, అభిషేక్ రంజన్, కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.