calender_icon.png 21 June, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ కస్టడీకి కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్

21-06-2025 02:04:32 AM

  1. ఐదు రోజులు విచారణకు కోర్టు అనుమతి
  2. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించినా ప్రస్తుత స్థానంలోనే కొనసాగటంపై ప్రత్యేక దృష్టి
  3. ఈఎంసీ అనిల్‌కుమార్‌తో సంబంధాలపై ఆరా

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన నేపథ్యంలో, ఆయన్ను ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. కరీంనగర్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న నూనె శ్రీధర్ నివాసం, కార్యాలయాలపై పది రోజుల క్రితం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో రూ.200 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆస్తులను కూడబెట్టడం చూసి అధికారులు సైతం విస్తుపోయారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేట్‌లో గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్, అమీర్‌పేట్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో మూడు భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఇళ్ల స్థలాలు, రెండు విలాసవంతమైన కార్లు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, పలు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఈ అక్రమాస్తుల చిట్టాలో ఉన్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా, శ్రీధర్ కుమారుడి వివాహాన్ని థాయ్‌లాండ్‌లో అత్యంత ఖరీదైన రిసార్టులు, హోటళ్లలో నిర్వహించడం, హల్దీ ఫంక్షన్‌ను సైతం అక్కడే జరపటం వంటివి అధికారుల విచారణలో వెల్లడయ్యాయి. శ్రీధర్‌ను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరింత కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావించారు. ఏసీబీ కోర్టులో ఐదు రోజుల కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయగా, కోర్టు అనుమతిని ఇచ్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నూనె శ్రీధర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ చేసినప్పటికీ దాదాపు ఏడాది పాటుఅక్కడే కొనసాగటంపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. కాళేశ్వరంలో పనిచేస్తున్న ఈఎంసీ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకే శ్రీధర్ అక్కడే ఉండి పనిచేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే, అనిల్‌కుమార్‌కు ఎవరు ఆదేశాలు జారీ చేశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ చేసినా శ్రీధర్ అక్కడే ఎందుకు పని చేశారు? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో శ్రీధర్ బ్యాంకు లాకర్లను కూడా తెరిచి, అతడి అక్రమాస్తుల పూర్తి చిట్టాను బయటపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.