23-10-2025 06:16:08 PM
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్..
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఎస్టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లయిందని ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే సిపిఎస్ ను రద్దు చేశాయని, హామీకి కట్టుబడి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టెట్ నుండి మినహాయింపు విద్యా హక్కు చట్టం సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ లో ఆర్థిక శాఖ అలసత్వం సరికాదన్నారు.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, ప్రభుత్వం అదే రీతిలో ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలు ఇంకా అందకపోవడంతో పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కెజిబివి, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్, జె. లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్ శేఖ్ నాయకులు యం. శ్రీనివాస్, పరమేశ్వర్, అశోక్ కుమార్, లక్ష్మి నారాయణ, ఖాలిద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు