17 June, 2026 | 2:16 AM

దగ్గుమందుకు ప్రిష్క్రిప్షన్ తప్పనిసరి

17-06-2026 01:18 AM

కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ నోటీఫికేషన్ జారీ

న్యూఢిల్లీ, జూన్ 16: ఇకపై దగ్గుమందు సహా పలు సిరప్‌ల కొనుగోలుకు వైద్యుల ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని ఔషధ నియంత్రణపై ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’తో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది. దీనిని షెడ్యూల్ ‘కె’ డ్రగ్స్ జాబితా నుంచి తొలగించింది.

నాసిరకం దగ్గుమందుల వల్ల పలువురు చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ చర్యలు చేపట్టింది. గతేడాది మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు కారణంగా 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సంస్థలో తనిఖీలు చేయగా, కోల్డ్రిఫ్ సిరప్‌లో 48.6 శాతం డై ఇథైలిన్ గ్లుకాల్ ఉన్నట్లు తెలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు నిర్ధారించారు. ఆ సిరప్‌పై నిషేధం విధించారు. ఈ ఘటన పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో తన హెచ్చరికల్లో పేర్కొంది. దీంతో భారత ఔషధ నియంత్రణ శాఖ కఠిన చర్యలకు దిగింది.