08-12-2025 12:00:00 AM
లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 7: లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 1976 1977లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యను అభ్యసించిన ప్రభుత్వ పాఠశాల నుంచి కెఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
పదో తరగతి చదువుకొని 48 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రతి విద్యార్థికి 60 సంవత్సరాలు దాటినా కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందనీయమని విద్యార్థులకు చదువు నేర్పిన గురువులు పేర్కొన్నారు.
చదువు చెప్పిన గురువులు గాదే మధు కర్, లక్ష్మీరాజం, కమల కుమారి, ఎల్లంకి సత్తయ్యలను పూలమాలతో సన్మానించి జ్ఞాపకలను అందజేశారు. తమ గుర్తుగా పాఠశాలకు రూ.పది వేల విలువగల బీరువాను అందించినట్లు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 52 మంది పూర్వ విద్యార్థులు జంటలతో షష్టిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ స్థాయిలో భవన నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత విద్యార్థులకు అన్ని వసతులతో ఉన్నత స్థాయి విద్య అందించడం గొప్ప విశేషమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గురువులు వొజ్జల రవీందర్, డాక్టర్ విజయమోహన్రెడ్డి, గుండ వీరేంద్ర దాస్, అమరేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.