ప్రతి ఇంటికి ఇంకుడుగుంత తప్పనిసరి
మోర్గి గ్రామంలో ఇంకుడు గుంతను పరిశీలించిన ఎంపీడీవో
నాగలిగిద్ద, జూలై 19: భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని నాగలిగిద్ద మండల ఎంపీడీవో మహేశ్వరరావు ప్రజలకు సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగత ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.6,690, కమ్యూనిటీ ఇంకుడు గుంతకు రూ.13,000 వరకు ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. అలాగే బోర్వెల్ సమీపంలో ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తే రూ.30,000 వరకు,
గ్రామాల్లో డ్రెయిన్ ఎండ్ పాయింట్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మిస్తే రూ.90,000 వరకు ప్రభుత్వం నిధులు అందజేస్తుందని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసిన అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయని వివరించారు.ఈ సందర్భంగా మోర్గి గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతను ఎంపీడీవో మహేశ్వరరావు పరిశీలించారు. ఆయనతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ పాల్గొన్నారు. ఇంకుడు గుంత నిర్మాణ విధానం,
నాణ్యత, కొలతలపై మేస్త్రీలను అడిగి తెలుసుకుని, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని పలు సూచనలు చేశారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో మహేశ్వరరావు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






