29-06-2025 01:06:19 AM
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదు: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు బీఆర్ఎస్ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అరాచక మూకలు మీడియా, సోషల్ మీడియా ముసుగులో తమపై అబద్ధాలు, అసత్యాలు, దురుదేశపూర్వక ప్రచా రాలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
జర్నలిజం ముసుగు లో, మీడియా సంస్థల యజమానులు కొన్ని నెలలుగా బీఆర్ఎస్ నాయకత్వంతోపాటు తనపై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మీడియా రూపంలో మీరు చేస్తున్న దాడులు తన శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, శ్రేణులను బాధ కలిగిస్తున్నాయని, వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు.
మహాటీవీకి బీఆర్ఎస్ లీగల్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై దురుద్దేశపూర్వకంగా వార్తలు ప్రసారం చేశారంటూ మహాటీవీకి బీఆర్ఎస్ లీగల్ విభాగం నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నాయకత్వంతోపాటు కేటీఆర్పై జర్నలిజం ముసుగులో మహాటీవీ మేనేజ్మెంట్ వ్యక్తిగతంగా విషం చిమ్ముతుండటంతో నోటీసులు ఇచ్చినట్టు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.