ఏపీకి అదానీ అదనపు భారం
- గ్రీన్ ఎనర్జీ ఒప్పందంలో కీలక పాయింట్
- సుంకాలతో యూనిట్కు 50 పైసలు అదనం
- ఏటా ప్రభుత్వంపై రూ.850 కోట్ల భారం
న్యూఢిల్లీ, నవంబర్ 30: సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ లంచాల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారమంతా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే కొనసాగుతున్న వేళ అదానీ గ్రీన్ ఎనర్జీ ఏపీకి ఇప్పటివరకు ఎలాంటి విద్యుత్తును సరఫరా చేయలేదని సమాచారం.
నిజానికి 2024 సెప్టెంబర్ నుంచి 3 వేల మెగావాట్లు అందించాలని మొదట నిర్ణయించిన ఈ ప్రాజెక్టు విషయంలో రెండ్నెల్లు దాటినా సప్లయి ప్రారంభం కాలేదు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2025 ఏప్రిల్ నాటికి విద్యుత్ సరఫరా 1,000 మెగావాట్లు, 2026 జనవరి నాటికి మరో వెయ్యి మెగావాట్లు విద్యుత్తును అందించనుంది. ఒప్పం దం ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి 6 వేల మెగావాట్ల అందించాలన్న ప్రతిపాదనకు ఇది చాలా తక్కువ.
రూ.850 కోట్ల అదనపు భారం
అదానీ గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం వల్ల ఏపీకి ఆర్థికంగాను మరింత భారం పడనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ ఎనర్జీ, ఏపీ ఒప్పందం ప్రకారం గుజరాత్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి విద్యుత్తు సరఫరా జరగుతుంది. నిజానికి యూనిట్కు రూ.2.49గా ఒప్పం దం జరిగింది. అయితే సోలార్ ప్యానెల్స్, సోలా ర్ సెల్పై గుజరాత్లో విధించే కస్టమ్స్ సుంకం కూడా ఏపీకి బదిలీ అవుతుందని ఒప్పందంలో ఉంది.
అంటే కిలోవాట్కు అదనంగా 50 పైస లు అధికంగా చెల్లించాల్సి ఉంటుం ది. దాని వల్ల యూనిట్ ధర రూ.3.069కి చేరుతుంది. ఫలితంగా అదానీ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాలంటే ఏటా అదనంగా రూ.850 కోట్లు చెల్లించాల్సి ఉంటుం ది. ఇది ప్రజలపై మరింత అదనపు భారం పడే అవకాశముంటుందని తెలుస్తోంది.
40 శాతం అధిక రేట్లు
సాధారణంగానే అదానీ గ్రీన్ ఎక్స్చేంజీలలో విద్యుత్తును అధిక ధరలకు విక్రయి స్తుంది. ఏపీకి కూడా ఇక్కడి నుంచే విద్యుత్తును సరఫరా చేయనుంది. యూనిట్కు సగటున రూ.3.5 చార్జి చేస్తోంది. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం యూనిట్కు రూ.2.42 మాత్రమే ధర ఉండాలి. కానీ ఇక్కడ 40 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. కాగా, అదానీ సోలార్ ప్రాజెక్టుల కోసం భారత్లో లంచాలు ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. అందులో ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో లంచ ంగా రూ.1,750 కోట్లు చెల్లించారని ఆరోపించింది.
కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
అదానీ గ్రీన్ ఎనర్జీని అధిక ధరలకు విక్రయించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) అనుమతులు ఇచ్చిందని, ఇది కేంద్రం మద్దతు వల్లనే జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. ఏపీతో ఒప్పందం ప్రకారం ఇప్పటికే 3 వేల మెగావాట్లు సరఫరా చేయాలని, కానీ ఇప్పటికీ ఒక్క యూనిట్ విద్యుత్తును అందివ్వలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మండిపడ్డారు. ఈ కాంట్రాక్టు కోసం వెయ్యి కోట్లకు పైగా లంచం తీసుకున్నా సరఫరాలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఇది బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని, అందుకు కృతజ్ఞతలు అంటూ ఎద్దేవా చేశారు.






