31-08-2024 12:00:00 AM
డా. తిరునాహరి శేషు :
విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కర్మాగారాలే కాదు సమకాలీన అంశా లపైన, సమస్యలపైన చర్చించే వేదికలు, మార్గ నిర్దేశకాలు కూడ. అలాగే, ఉన్నత విద్యావ్యవస్థలో అటు బోధనలోనూ, ఇటు పరిశోధనలోనూ ఒక ప్రత్యేకతను కలిగివున్న విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్వ వైభవాన్ని, ప్రతిష్ఠను కోల్పోతుండడం బాధాకరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ 2024 (నేషనల్ ఇన్స్టిట్యూషన ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్) ర్యాంకింగ్స్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని ఏ ఒక్క విశ్వవిద్యాలయం కూడా మెరుగైన శ్రేణిని సాధించలేకపోయాయి.
విశ్వవిద్యాలయా ల విభాగంలో మొదటి వంద ర్యాంకులలో తమిళనాడు నుంచి 15, కర్ణాటక నుంచి 11, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, కేరళ నుంచి 4 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకుంటే, తెలంగాణ నుంచి 2 విశ్వవిద్యాలయాలు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాత్రమే చోటు దక్కించుకున్నా యి. తెలంగాణలోని రెండు ప్రధాన విశ్వవిద్యాలయాలలో ఒకటైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు 36 నుండి 43కి పడిపోతే, మరొక విశ్వవిద్యాలయం కాకతీయకు మొదటి 100 ర్యాంకులలోనూ చోటు దక్కలేదు. దీన్నిబట్టి, తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నాణ్యతా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పదేళ్లుగా సమస్యల వలయంలోనే!
వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి అయిదు సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభు త్వ ఆధ్వర్యంలో 18 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే లక్ష్యంలో భాగం గా శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీలను తెలంగాణలో నాటి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం స్థాపించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర సాధనోద్యమ కేంద్రాలుగా విలసిల్లిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
గత పది సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర సిబ్బంది నియా మకాలు చేపట్టక పోవటం, బడ్జెట్లో విశ్వవిద్యాలయాల నిర్వహణకు కావలసిన నిధులను కేటాయించక పోవటం, ఉపకులపతుల నియామకాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టక పోవడంతో నిత్యం విశ్వవిద్యాలయాలు సమస్యల వలయంలో చిక్కుకు పోయాయి.
ఐదేళ్లుగా ఇన్చార్జ్ల పాలనే
గడచిన పదేళ్ల కాలంలో 2014 నుంచి 2016 వరకు, 2019 నుంచి 2021 వరకు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించకపోవడంతో ఇన్ఛార్జ్ల పాలనే కొనసాగింది. గత ప్రభు త్వం రెండు పర్యాయాలు వైస్ ఛాన్సలర్లను నియమించినా వారు పూర్తి సామ ర్థ్యంతో పని చేయక పోవడం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీల పరిస్థితి మరింత దిగజారింది. మరొక వైపు ఒక దశాబ్దానికి పైగా విశ్వవిద్యాలయాలలో రిక్రూట్మెంట్స్ అటక ఎక్కా యి.
11 ప్రధాన విశ్వవిద్యాలయాలలో 75 శాతం బోధనా సిబ్బంది ఖాళీగా ఉండటంతో బోధనపైన, పరిశోధనపైన ప్రతికూ ల ప్రభావం పడింది. దీనివల్లే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో ర్యాం కులు సాధించడంలో వెనుకబడి పోతున్నాయని పరిశీలకుల భావన. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విశ్వవిద్యాలయాలలో వివి ధ దశలలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు 4,500కి పైగా ఖాళీగానే ఉన్నా యి. శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బం ది నియామకాలు చేపట్టక పోవటం వల్ల 1,445 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 678 మంది పార్ట్టైం అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న మరొక ప్రధాన స మస్య నిధుల లేమి. ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మినహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గత కొంతకాలంగా విశ్వవిద్యాలయాలు అంతర్గతంగా సమకూర్చుకొనే నిధులు తగ్గిపోవటంతో నిధు ల కోసం యూనివర్సిటీలు పూర్తిగా ప్రభు త్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్, అభివృద్ధి నిధులపైనే ఆధార పడుతున్నాయి.
కానీ, ప్రభు త్వాలు బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు చా లీచాలని నిధులు కేటాయించడం, వాటిని కూడా సకాలంలో విడుదల చేయక పోవడం వల్ల వర్సిటీలను నిధుల సమస్య వెంటాడుతున్నది. 2023-- బడ్జెట్లో రూ.784.64 కోట్లు, 2024- బడ్జెట్లో రూ.910.34 కోట్లు మాత్రమే బ్లాక్గ్రాంట్ కింద ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు కేటాయించింది. కేటాయించిన నిధులే అరకొర కాగా, వాటినికూడా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో విశ్వవిద్యాలయాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
కొత్త సర్కార్లోనూ అదే దుస్థితి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశ్వవిద్యాలయాల పరిస్థితులలో మార్పులు వస్తాయని, కొత్త ప్రభుత్వం సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పరిష్కార మార్గాలను చూపెడుతుందని ఆశించారు. కానీ, మే 21 నాటికి పది విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం ముగిసి మూడు నెలలు అవుతున్నా ప్రభుత్వం వర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది కానీ, వీరి నియామకాలలో జా ప్యం తప్పడం లేదు. దీనిపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
మూడు నెలలుగా రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలు ఇన్ఛార్జ్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో వైస్ చాన్సలర్ల నియామకాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశ్వవిద్యాలయాలు ఈ దుస్థితిలో ఉండటానికి ఒక కారణం. నిప్పు కణికలు లాంటి వీసీలను నియమిస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వీసీలు ఎంత వివాదాస్పదంగా వ్యవహరించారో అందరికీ విదితమే.
కానీ, ప్రస్తుత ప్రభుత్వమైనా రాజకీయ ప్రమేయం, పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా అనుభవం, అర్హత, సమర్థత, నిర్వహణ నైపుణ్యం కలవారిని వీసీలుగా నియమించవలసి ఉంది. లేకపోతే భవిష్యత్తులో వర్సిటీల పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, కొత్త ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ల నియామకాలను మరింత ఆలస్యం చేయకుండా సత్వరమే పూర్తి చేయాలి. అదే సమయంలో యూనివర్సిటీల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించడానికి దృష్టి పెట్టాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.
ప్రధానంగా రిక్రూట్మెంట్, కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల కు ఉద్యోగ భద్రత, నిధుల కొరత, కనీస సౌకర్యాల కల్పన లాంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లా డుతూ, నలంద అంటే ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక విలువ, ఒక అద్భుతమంటూ వ్యాఖ్యానించారు. ఏ వర్సిటీకైనా దాని స్థాయికి తగ్గ విలువ, గౌరవం ఉంటాయి. కాబట్టి, అంతటి ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాలను రక్షించుకోవాల్సిన అవసరం, వాటి స్థాయిని, గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది.
వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్,
కాకతీయ విశ్వవిద్యాలయం
సెల్: 9885465877