26 February, 2026 | 10:17 AM

రావిచెడ్‌లో కల్తీ పాల గుట్టు రట్టు

26-02-2026 12:56 AM

నిర్వాహకుడు శ్రీశైలం గౌడ్ అరెస్ట్ 

కడ్తాల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కడ్తాల్ మండలంలోని రావిచెడ్ గ్రామంలో కల్తీ పాల దందా గుట్టు రట్టు అయింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో బుధవారం భారీ ఎత్తున సాగుతున్న కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టును మహేశ్వరం ఎస్‌ఓటీ, స్థానిక కడ్తాల్ పోలీసులు రట్టు చేశారు. రావిచేడ్ గ్రామానికి చెందిన అనగోని శ్రీశైలం పాల సేకరణ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

లాభాపేక్షతో షాద్‌నగర్ నుంచి కల్తీ పాలకు కావలసిన ముడి పదార్థాలను సేకరించి, తన నివాసంలోనే కృత్రిమ పాలను తయారు చేస్తు న్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు మహేశ్వరం ఎస్‌ఓటీ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అతడిని పట్టుకున్నారు.

పోలీసుల తనిఖీల్లో కల్తీ పాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 45 ప్యాకెట్ల డ్రైడ్ టీ కాఫీ క్రీమర్ (పాల చిక్కదనం కోసం), 12 ఉప్పు ప్యాకెట్లు, విడిగా ఉంచిన పంచదార,6 క్యాన్ల నిండా సిద్ధం చేసిన కృత్రిమ పాలు, పాలు రవాణా చేసేందుకు ఉపయోగించే ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షాద్‌నగర్ నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసి, ఇక్కడ కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. శ్రీశైలంను అరెస్టు చేశారు.